Telugu ethics stories in Telugu Moral Stories by Yamini books and stories PDF | తెలుగు నీతి కథలు

The Author
Featured Books
Categories
Share

తెలుగు నీతి కథలు

ఆత్మీయులకు విలువ ఇవ్వండి, విలువ: ప్రేమ, అంతర్గత విలువ: క్షమ, కృతజ్ఞత
ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఒక ఎడారిలో నడుస్తున్నారు. త్రోవలో ఒకచోట ఇద్దరిమధ్యా ఏదో వాదన జరిగింది.ఇద్దరిలో ఒకతను రెండవవాని చెంపపై కొట్టాడు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఏమీ మట్లాడకుండా, ”ఈ రోజు నా ప్రాణస్నేహితుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు” అని ఇసుకలో రాసాడు. ఒక ఒయాసిస్ దగ్గరగా కనిపించేవరకు నడిచి, ఒయాసిస్ కనిపించేక అందులో దిగి స్నానం చేద్దామని అనుకున్నారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఊబిలో దిగి కూరుకుపోసాగాడు. కాని రెండవవాడు అతను కూరుకుపోకుండా కాపాడాడు. స్నేహితుడు ఊబి నుండి పైకి లాగి కాపాడిన తరువాత అతడు ఒక రాతిపై ” నా స్నేహితుడు ఈరోజు నా ప్రాణం కాపాడాడు” అని రాసాడు. ముందు చెంపదెబ్బ కొట్టి తరువాత తానే తన స్నేహితుడి ప్రాణం కాపాడినవాడు తన మిత్రునితో ” నిన్ను కొట్టినపుడు ఇసుకలో రాసావు,ఇప్పుడు కాపాడినపుడు రాతిపై రాసావు, ఎందుకు?” అని అడిగాడు.అప్పుడు ఆ రెండవవాడు ” ఇతరులు మనని బాధపెట్టినపుడు మనం ఇసుకలో రాసుకోవాలి ఎందుకంటే ఆ వ్రాత క్షమాగుణం అనే గాలికి కొట్టుకుపోవాలి.కాని ఎవరైనా మనకి ఏదయినా ఉపకారం చేసినప్పుడు అది రాతిపై రాసుకోవాలి ఎప్పటికి చెరిగిపోకుండా” అని అన్నాడు.
నీతి: నీకు జీవితంలో ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్న వాటికి విలువనివ్వవద్దు. నీ జీవితంలో ఉన్న వ్యక్తులకు విలువనివ్వు.

కోపంలో ఉన్నపుడు మనం ఎందువలన గట్టిగా అరుస్తాం?, విలువ : శాంతి, అంతర్గత విలువ: శాంతము, మౌనం
ఒక రోజున ఒక హైందవ సాధువు తన శిష్యులతో కలిసి గంగానది వద్దకు స్నానం చెయ్యడానికి వెళ్ళేడు. అక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు కొంతమంది కోపంతో ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. ఆ సాధువు తన శిష్యులవైపు చూసి నవ్వుతూ వారిని ఇలా అడిగేడు.

"కోపంలో ఉన్నప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎందుకు అరుచుకుంటారు?”ఒక్క క్షణం ఆలోచించిన తరవాత ఆ శిష్యులలో ఒకడు ఇలా సమాధానం చెప్పేడు, “మనం సహనాన్ని కోల్పోవడం వల్ల అరుస్తుంటాము." "కాని మనుషులు పక్కనే ఉన్నప్పుడు అలా అరవలసిన అవసరం ఏముంది? మెల్లగా పక్కనే ఉన్నవాళ్ళకి నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అన్నారు సాధువు. మిగిలిన శిష్యులు కూడా వారికి తోచిన విధంగా సమాధానాలు చెప్పేరు కాని ఎవరుచెప్పిన అభిప్రాయము సంతృప్తికరంగా లేదు. చివరకు సాధువు ఇలా వివరించేరు.

ఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు చాలా దూరం అయిపోతాయి. ఆ దూరాన్ని అధిగమించడం కోసం, వాళ్ళకి వినిపించడంకోసం అలా గట్టిగా అరుచుకుంటూ ఉటారు. కోపం ఎక్కువయిన కొద్దీ తమ మధ్య పెరుగుతున్న దూరం కారణంగా మరింత గట్టిగా అరుచుకుంటారు. అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏమాత్రం అరుచుకోకుండా ఎంతో మెల్లగా, మృదుమధురంగా మట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఎంతో దగ్గరగా ఉంటాయి కనుక. ప్రేమలో ఉన్నప్పుడు మనుషుల హృదయాల మధ్య దూరం చాల తక్కువగా, అసలు దూరమే లేనట్లుగా ఉంటుంది.

ఆ సాధువు తన శిష్యులకు ఇంకా ఈ విధంగా వివరించేరు. మనుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు ఏంజరుగుతుంది? వాళ్ళు మాట్లాడరు, ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ చాలా ప్రేమగా దగ్గరవుతారు. చివరకు వాళ్ళ్ళకు గుసగుసలతో కుడా అవసరం లేకుండా ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుంటారు.అంతే ఆవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి హృదయాలమధ్య అసలు దూరమే లేకుండా దగ్గరవుతాయి. ఆ సాధువు తన శిష్యులతో ఇంకా ఈ విధంగా అన్నాడు. "కాబట్టి మీరు వాదించుకునేటప్పుడు కోపంతో మీ హృదయలను దూరం చేసుకోకండి.మనుషుల మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకండి.లేకపొతే ఆ దూరం ఎప్పటికీ దగ్గరకాలేనంతగా పెరిగిపోతుంది.”
నీతి: కోపం వచ్చినపుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి. అటువంటి కోపంలో మట్లాడే మాటలు అవతలి వ్యక్తి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి.కోపం మనల్ని మనకి ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది.

నమ్మకద్రోహం
ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టుమీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క. కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓరోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ తింది. కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకూ తెలియదంది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది.

తర్వాతి రోజు తన గూటికి దగ్గర్లో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి, దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరచుకుని పెకై గిరింది. వాళ్లెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది. అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు, ఎండుపుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్దపిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్లముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండివుంటే, ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది.
నీతి: నమ్మినవాళ్లను మనం బాధపెడితే, చివరకు మనకూ బాధే మిగులుతుంది.